లాక్​డౌన్​ పొడిగించిన కర్ణాటక.. రూ. 500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

3 Jun, 2021 19:23 IST|Sakshi

బెంగళూరు: దేశంలో కరోనాఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్​వేవ్​లో వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు కోవిడ్​ కట్టడికి లాక్​డౌన్​ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, కేసులు అదుపులోకి వస్తున్న క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి.

తాజాగా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప జూన్​ 14 వరకు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని.. మరికొన్ని రోజులు లాక్​డౌన్​ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు.  కాగా, రాష్ట్రంలో కోవిడ్​  పాజిటివిటీ తీవ్రత 5 శాతానికి తగ్గిందని అన్నారు. అయితే, ఈ సారి ప్రత్యేకంగా మత్స్యకారులు, పూజారులు, పవర్‌లూమ్ కార్మికులు..ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. 

ప్రతిరోజు నమోదవుతున్న కేసులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.  లాక్​డౌన్​ వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయితే, ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రజల జీవనోపాధి కోసం 1,250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు.  అలాగే, తమ ప్రభుత్వం ఈ నెలలో 60 లక్షలకు పైగా వ్యాక్సిన్​లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జూన్​ 30 నాటికి దాదాపు 2 కోట్ల మందికి టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్​లను సరఫరాకు చేయుత అందించిన ప్రధాని మోదీకి, యడ్యూరప్ప ట్వీటర్​లో ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు