Varanasi: బాలరామునికి బొమ్మల బహుమానం

3 Jan, 2024 12:09 IST|Sakshi

అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్‌ బ్యాంక్‌’ సిద్ధమవుతోంది. 

వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్‌  చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. 

ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందు​కు  ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 

మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్‌ బ్యాంక్‌ ఎంతో ఆదరణ పొందుతోంది. 
ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..

>
మరిన్ని వార్తలు