దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి: మోదీ

7 Nov, 2020 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచంలో టెక్నాలజీ, ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 51వ కాన్వొకేషన్‌ వేడుకకు మోదీ ముఖ్య అతిధిగా వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'కోవిడ్‌ తర్వాత ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. సాంకేతికత అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహమ్మారి రోజూవారీ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఇప్పుడు వర్కింగ్‌ రియాలిటీగా మారుతున్నాయి. గ్లోబలైజేషన్ ముఖ్యం అయితే, స్వావలంబన కూడా అంతే ముఖ్యం.   (ట్రంప్‌ని కూడా ఇలానే పంపాల్సి వస్తుందేమో..)

ఆత్మనిర్భర్‌ భారత్‌ దేశ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీ ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారా పేదల జీవితాలు సులువుగా జీవించేలా ఉపయోగపడాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాల కోసం కృషి చేయాలని మోడీ ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతపై భారతీయులకు అపారమైన నమ్మకం ఉంది. దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. దేశం ఎదుర్కొంటున్న అపారమైన సవాళ్లు కూడా మీ ముందు ఉన్నాయి. వీటికి మీరు పరిష్కారాలు చూపాలి.   (జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు)

విపత్తు నిర్వహణ, భూగర్భజలాలను నిర్వహించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి, టెలిమెడిసిన్ మరియు బిగ్‌డేటా విశ్లేషణ వంటి రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. దేశ అవసరాలకు అనేక ఇతర ఉదాహరణలను నేను మీ ముందు ఉంచగలను అని మోదీ అన్నారు. సవాళ్లను ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, ప్రయత్నాలతో పరిష్కరించవచ్చు అని మోడీ అన్నారు. అందుకే దేశ అవసరాలను గుర్తించి ఆత్మనిర్భర్‌ భారత్‌తో మిమ్మల్ని అనుబంధించాలన్నది నా అభ్యర్థన' అంటూ మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు