నోరుజారిన సీఎం నితీష్‌.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు

7 Nov, 2023 21:26 IST|Sakshi

బిహార్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నోరుజారారు. జనాభా నియంత్రణపై రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ నితీష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో వివరిస్తూ ముఖ్యమంత్రి అసభ్యకరమైన, కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు. నితీష్‌ మాట్లాడుతూ.. ‘గతంలో 4.3 శాతం సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయింది. సెక్స్‌ ఎడ్యుకేషన్ (లైంగిక విద్య) గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన పెరిగింది. ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు. అందుకే జనాభా తగ్గుతోంది’ అని వ్యాఖ్యానించారు. 

సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సీఎం నితీష్‌ను అత్యంత నీచమైన వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించింది. ‘దేశ రాజకీయాల్లో నితీష్‌ అంత అసభ్యకరమైన నాయకుడిని చూడలేదు. అతని మనసుంతా చెత్త ఆలోచనలతో నిండిపోయి ఉంది. సీఎం డబుల్‌ మీనింగ్‌ వ్యాఖ్యాలను నిషేధించాలి’ ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేసింది. 

సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం సీఎం వ్యాఖ్యలను సమర్ధించుకున్నాయి. పాఠశాలల్లో బోధించే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విద్య గురించి నితీష్‌ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు.  పాఠశాలల్లో విద్యార్థులు సైన్స్, జీవశాస్త్రంలో దీన్ని నేర్చుకుంటారని అన్నారు.
చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

>
మరిన్ని వార్తలు