వైరల్‌: ఓం కరోనా ఫట్‌,ఫట్‌,ఫట్‌ స్వాహా!..

21 May, 2021 16:50 IST|Sakshi
వీడియో దృశ్యం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతోంది. వైరస్‌ను కట్టడి చేయటానికి ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్‌డౌన్‌, కర్ఫ్యూల బాట పట్టాయి. వీలైతే మరింత కఠిన చర్యలు తీసుకునైనా కరోనా ఉధృతిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వాలే తలలు పట్టుకుంటున్న పనిని మంత్రాలతో చేస్తామని కొంతమంది రంగంలోకి దిగుతున్నారు. తాజాగా, ఓ మంత్రగాడు కరోనాను తరమటానికి ఏకంగా కరోనా వార్డులో పూజలు నిర్వహించాడు. ‘ఓం కరోనా ఫట్‌, ఫట్‌, ఫట్‌.. స్వాహా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మంత్రాలు జపించాడు. కరోనా పారిపోవటం ఏమో కానీ, ఆయన మాత్రం బాగా పాపులర్‌ అయిపోయాడు. నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్‌ వరిందర్‌ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘గో కరోనా గో 2.0’ అనే శీర్షికను జత చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 42 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ బాబాజీ చివరకు కరోనాకు వ్యాక్సినేషన్‌ చేశారు..’’.. ‘‘ దెబ్బకు కరోనా పరుగులు పెట్టింది. మీరు చాలా పవర్‌ఫుల్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న పూర్తి వివరాలు తెలియరాలేదు.

చదవండి : పోలీస్‌ కొంపముంచిన వివాహేతర సంబంధం

మరిన్ని వార్తలు