Omicron Variant: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మళ్లీ ఆంక్షలు 

16 Dec, 2021 13:39 IST|Sakshi

నేటి నుంచి నూతన మార్గదర్శకాలు

పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం

Fresh Guidelines For Omicron Strain: ముంబైలో కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న  నేపథ్యంలో ముంబై పోలీసులు కరోనా నియమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను, నియమాలను జారీ చేశారు. ఈ నూతన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జరిగే వివాహాలు, ఇతర వేడుకలపై ఆంక్షల ప్రభావం పడనుంది. దేశవ్యాప్తంగా ఇటీవల ఒమిక్రాన్‌ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదయ్యే ఒమిక్రాన్‌ కేసులలో సుమారు 50 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా డిసెంబర్‌ 31 వేడుకలు, ఇతర కార్యక్రమాలతో ఒమిక్రాన్‌ విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 31 వరకు ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ఇప్పటికే అమలులో ఉన్న నియమాలను ప్రజలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలించనున్నారు.  

వ్యాక్సిన్‌తోనే పూర్తి స్థాయి రక్షణ 
ముంబైలో అయిదు వేల మంది కాలపరిమితి పూర్తయినప్పటికీ రెండో డోస్‌ తీసుకోలేదు. రెండు డోసులు తీసుకుంటేనే కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందనీ, దీన్నొక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మునిసిపల్‌ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతున్నారు. ప్రతి రోజూ బెస్ట్‌ బస్సుల్లో 28 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారనీ, కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు.. దేశంలో మొత్తం 77 కేసులు

కరోనాపై పోరులో కొత్తమందు!

మరిన్ని వార్తలు