Corona Virus: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

10 Jan, 2022 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో సరైన ఆరోగ్య మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ వహించాలని, యువతకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కరోనా వైరస్‌ నిరంతరాయంగా మార్పులు పొందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు, టీకాలపై శాస్త్రీయ పరిశోధన నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. మాసు్కల వినియోగాన్ని కట్టుదిట్టం చేయడం, భౌతిక దూరం నిబంధనల పాటింపు వంటి విధానాలతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఆయన సూచించినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అల్ప లేదా అసలు లక్షణాలు లేని కేసుల విషయంలో హోం ఐసోలేషన్‌ను పకడ్బందీగా పాటించడం, నిజమైన సమాచారాన్ని అందరికీ అందించడం వంటివి తప్పనిసరి అని మోదీ చెప్పారు.

కరోనాపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైనట్లు చెప్పారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఈ సంక్షోభ సమయంలో అందిస్తున్న సేవలు విలువైనవని ఆయన కొనియాడారు. యువతకు టీకాలు ఆరంభించిన తొలి ఏడు రోజుల్లోనే దాదాపు 31 శాతం యువత(15–18 ఏళ్ల వారు)కు తొలిడోసు అందించినట్లు అధికారులు తెలిపారు.

చదవండి: కోవిడ్‌ నుంచి కోలుకున్న కేజ్రీవాల్‌.. ఢిల్లీలో లాక్‌డౌన్‌పై క్లారిటీ

మరిన్ని వార్తలు