PM Modi: వ్యాక్సిన్‌ ఒక సురక్ష చక్రం

27 Sep, 2021 04:46 IST|Sakshi

అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోండి

పండుగ సీజన్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటించండి

మన్‌ కీ బాత్‌లో ్రపజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దసరా, దీపావళి దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్‌లో కోవిడ్‌–19 నిబంధనలు అందరూ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌ 81వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు. పండుగలొస్తున్న సమయంలోనే కోవిడ్‌–19పై పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలన్నారు. ‘‘భారత్‌ వ్యాక్సినేషన్‌లో ప్రతీ రోజూ ఒక సరికొత్త రికార్డు సాధిస్తోంది.

అంతర్జాతీయ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. కరోనా నుంచి రక్షణనిచ్చేది వ్యాక్సిన్‌ మాత్రమే’’అని మోదీ అన్నారు.‘వ్యాక్సిన్‌ అన్నది ఒక సురక్ష చక్రం వంటిది. మీ చుట్టు పక్కల వారికి టీకా వేయించాల్సిన బాధ్యత మీదే. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ కోవిడ్‌ నిబంధనలు పాటించాలి’’అని ప్రధాని చెప్పారు. ఈసారి మోదీ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నదుల పరిశుభ్రత, డిజిటల్‌ లావాదేవీలు, స్వచ్ఛభారత్‌ వంటి అంశాలపై మాట్లాడారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని రికార్డు చేశారు.  

టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట
నిరుపేదల కోసం టాయిలెట్లు నిర్మించి స్వచ్ఛభారత్‌ కోసం ఎలా పోరాడామో ఆర్థిక రంగం స్వచ్ఛంగా ఉండేలా, నిరుపేదల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండడానికి డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జన్‌ధన్‌ ఖాతాల్లో లబి్ధదారులకు నేరుగా డబ్బు జమ అవుతూ ఉండడంతో దిగువ స్థాయిలో అవినీతిని కట్టడి చేశామన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా ప్రతీ ఒక్కరూ ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి టెక్నాలజీతో యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారని చెప్పారు. ఆగస్టు నెలలో 355 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగాయని వెల్లడించారు. రోజుకి సగటున 6 లక్షల కోట్ల నగదు లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయని, డిజిటల్‌ ఎకానమీ పారదర్శకత, స్వచ్ఛతకు ప్రతీక అని అన్నారు.

సెంట్రల్‌ విస్టా సందర్శన
కొత్త పార్లమెంటు నిర్మాణ స్థలాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. పనుల్లో నిమగ్నమై ఉన్న కారి్మకులతో మాట్లాడి, నిర్మాణం సాగుతున్న తీరును తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటులో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్‌ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు ప్రధాని, ఉపరాష్ట్రపతుల నివాసాలు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు