లండన్‌ నుంచి వచ్చిన 433 మంది ఎక్కడున్నారు?

1 Jan, 2021 08:57 IST|Sakshi

సాక్షి, చెన్నై : బ్రిటన్‌లో పుట్టిన కొత్త కరోనా భయంతో ప్రజలు వణికిపోతుండగా తిన్నగా లండన్‌ నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రయాణికులు ఆరోగ్యశాఖ కన్నుకప్పి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంగ్లండ్‌ నుంచి తమిళనాడుకు వచ్చిన 433 మంది ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. వందరోజులకు పైగా చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు రోగులకు గురవారం ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి సాగనంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద 20 మంది రూపుమార్చుకున్న కరోనా బారినపడగా తమిళనాడులో ఒక్కరు మాత్రమే ఉన్నారని అన్నారు.

నవంబర్, డిసెంబర్‌లో బ్రిటన్‌ నుంచి 2,080 మంది తమిళనాడుకు చేరుకోగా వీరిలో 487 మంది ఆచూకీ తెలియలేదు. వీరంతా చెన్నై, చెంగల్పట్టు జిల్లాలకు చెందిన వారని తేలడంతో అవిశ్రాంతంగా గాలిస్తుండగా వీరిలో 54 మంది మరలా లండన్‌కు వెళ్లిపోయినట్లు తెలుసుకున్నామని చెప్పారు. ఎలాంటి వైరసైనా కబసుర కషాయం అణచివేస్తుందని ఆయన తెలిపారు. స్పెయిన్‌ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన యువ కుని (27)కి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో యువకుడిని ఉంచి కరోనా చికిత్స చేస్తున్నారు. కొత్త, పాత కరోనా నిర్ధారణకు యువకుడి నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరుకు పంపారు.  

సేలం ఎంపీకి కరోనా: 
సేలం లోక్‌సభ సభ్యుడు, డీఎంకే నేత ఎస్‌ఆర్‌ పార్థిబన్‌ కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇటీవల జ్వరం సోకడంతో సేలంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా గురువారం పాజిటివ్‌ నిర్ధారౖణెంది. దీంతో అదే ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.  

పోరాడి గెలిచిన కరోనా యోధులు: 
వందరోజుల వరకు కరోనాతో పోరాడి గెలిచిన ఇద్దరు యోధులు గురువారం ఇంటిదారిపట్టారు. చెన్నై రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్‌)లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందుతుండగా 90 ఏళ్లకు పైబడినవారు సైతం కోలుకుంటున్నారు. ఇదే ఆస్పత్రిలో అత్యధికరోజులు కరోనా చికిత్స పొందిన ధనపాల్‌ (45), కార్తిక్‌ (37) గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.    

కిరణ్‌బేడీ వ్యక్తిగత కార్యదర్శికి కరోనా? 
పుదుచ్చేరీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కోయంబత్తూరుకు చెందిన యువతికి పాజిటివ్‌ నిర్ధారౖణెంది. గవర్నర్‌ కిరణ్‌బేడీ రాజ్‌నివాస్‌ మొదటి అంతస్థులో నివసించడం వల్ల ఆ అంతస్థులోని ఉద్యోగులకు పరీక్షలు చేశారు. కిరణ్‌బేడీ ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు చేయించుకున్నారు. వ్యక్తిగత కార్యదర్శి పాజిటివ్‌ బారినపడడంతో గురువారం మళ్లీ కిరణ్‌బేడి పరీక్షలు చేయించుకున్నారు.  

మరిన్ని వార్తలు