200 రోజులుగా జైల్లోనే.. తమిళనాడు మంత్రికి మరోసారి ఎదురుదెబ్బ

12 Jan, 2024 18:50 IST|Sakshi

చెన్నై: ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడిలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీకి మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్‌ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను చెన్ననై సిటీ కోర్టు మూడోసారి తిరస్కరించింది. ఈ కేసులో ఎలాంటి మార్పు జరగనందున బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు చెన్నై ప్రిన్సిపల్ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ అలీ తీర్పునిచ్చారు. 

కాగా గతేడాది జూన్‌ 14న మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అన్నా డీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ(2018లో ఆయన డీఎంకే పార్టీలో చేరారు).. రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆఈ కేసులో కేసు నమోదు చేసిన ఈడీ.. అతన్ని అరెస్ట్‌ చేసింది. అరెస్ట​ సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు.
చదవండి: ‘ఆటల్‌ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే!

అక్కడ మంత్రికి బైపాస్‌ సర్జరీ జరిగింది. అనంతరం ఈడీ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని తరువాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచి అతని రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తూనే ఉంది. గత 200రోజులకు పైగా సెంథిల్‌ జైల్లోనే ఉన్నారు. ఎటువంటి పోర్ట్‌ఫోలియో లేకుండా డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక ఆగస్టులో బాలాజీపై ఈడీ 3, 000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్య కారణాలతో ఇప్పటి వరకు మూడుసార్లు బాలాజీ బెయిల్‌ కోసం అభ్యర్ధించగా.. ప్రతిసారీ కోర్టులో తిరస్కరణే ఎదురైంది. అంతకముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు అక్టోబర్ 19న కొట్టివేసింది. ముందస్తు బెయిల్ దరఖాస్తులను చెన్నై కోర్టు రెండుసార్లు కొట్టివేసింది.

>
మరిన్ని వార్తలు