మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌

29 Jun, 2021 11:38 IST|Sakshi

ముంబై: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వ‌ర‌కు సుమారు 32కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవడం పరిపాటి. అయితే మహారాష్ట్రలోని ఓ మహిళా ఏకంగా మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంది. అది కూడా కేవలం ఒకరోజులోనే.

థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న మహిళ గంటల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్‌ వేశారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో వ్యాక్సినేన్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య తొలిసారి టీకా వేసుకుంటున్నందున వ్యాక్సిన్‌ ప్రక్రియ గురించి అవగాహన లేదన్నారు. సిబ్బంది గంటల వ్యవధిలో మూడు డోసులు  ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చిందన్నారు. మరుసటి రోజు ఉదయం అది తగ్గి.. ఇప్పుడు బాగానే ఉందన్నారు. ఇక ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్‌ వద్ద లేవనెత్తగా.. మున్సిపల్‌ కార్పొరేన్‌ ఆమెకు సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు

.అయితే ఆమె భర్త అదే చోట పనిచేస్తున్నందున ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ఆమెకు ఇష్టం లేదని తెలిపింది. కాగా  సిబ్బంది గమనించకుండా మూడుసార్లు టీకాలు ఏలా వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ దావ్‌ఖారే మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తెలిపారు.

చదవండి: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్‌

మరిన్ని వార్తలు