Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ

28 Oct, 2021 14:32 IST|Sakshi

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌  స్టార్‌హీరో కుమారుడు డ్రగ్స్‌  కేసు ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు  ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్ట్‌  చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడేపై వేటు వేసుందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భార్య క్రాంతి  రేడ్కర్‌ వాంఖడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌, సమీర్‌ మధ్య ముదురుతున్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరాఠీ ప్రజల సమాన హక్కుల కోసం పోరాడుతున్న శివసేనను చూస్తూ పెరిగిన మరాఠీ అమ్మాయినైనా తాను ప్రతీరోజు అవమానాల పాలు కావాల్సి వస్తోందని, ఛత్రపతి శివాజీ మహారాజ్,  బాలాసాహెబ్ రాష్ట్రంలో ఒక మహిళకు తీరని అవమానం జరుగుతోందని  క్రాంతి వాపోయారు. ఈ రోజు బాలాసాహెబ్ ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ ఠాక్రేల  సిద్ధాంతాలను గౌరవిస్తూ పెరిగాను. ఎవరికీ అన్యాయం చేయకూడదని, అన్యాయాన్ని అస్సలు సహించకూడదని ఆ నేతలంతా తనకు  నేర్పించారని ఆమె అన్నారు.  బాలాసాబ్‌లో  మిమ్మల్ని చూసుకుంటున్నానంటూ సీఎం ఠాక్రే నుద్దేశించి లేఖ రాశారు. తన కుటుంబానికి అన్యాయం చేయరనే  విశ్వాసాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు.  

ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన  క్రాంతి ఎన్‌సీబీ అధికారి, తన భర్త సమీర్ వాంఖడేకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సీఎం అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. సమీర్‌ పనిచేయడం, చాలా మందికి నచ్చడం లేదని, డ్రగ్స్‌ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను తొలిగించాలని భావిస్తున్నారని,  తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని క్రాంతి ఆరోపించారు.

ఈ వ్యవహారంలో మాలిక్‌ ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే సోదరి, న్యాయవాది యాస్మీన్ గురువారం ముంబై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదును  ఆమె సమర్పించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.

కాగా ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే దోపిడీ, అక్రమ ట్యాపింగ్, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు వెల్లు వెత్తాయి. క్రూయిజ్ షిప్ వివాదంలో ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో  సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు మంత్రి నవాబ్‌మాలిక్‌ కూడా సమీర్‌పై ఆరోపణలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మోసపూరితంగా జనన ,  మరియు, కుల ధృవీకరణ పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మరోవైపు సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి ఎన్సీబీ దాడులు చేస్తోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు