వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

18 Nov, 2023 07:54 IST|Sakshi

అహ్మదాబాద్‌: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వైదికైంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా  ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్‌ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.  

మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. 

భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్‌లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్‌లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. 

ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్‌కప్‌లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్‌లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. 

ఇదీ చదవండి: జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..

మరిన్ని వార్తలు