సాక్షి ప్రతినిధి, గుంటూరు/అమరావతి/పెదకూరపాడు: కృష్ణా తీరం పులకించింది. అమరావతి జనసంద్రమైంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్ యాత్రకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ధరణికోట జేబీ గార్డెన్స్ వద్ద నుంచి ప్రారంభమైన బస్ యాత్ర మూడు కిలోమీటర్ల మేర సాగింది. అమరావతిలో భారీ బహిరంగ సభ జరిగింది. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీలు విజయసాయిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, షేక్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్, సినీ నటుడు అలీ, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎంతో అభివృద్ధి
నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నీ సీఎం జగన్ నిలబెట్టుకున్నారన్నారు. మాదిపాడు– ముక్త్యాల, అమరావతి– తుళ్లూరు రోడ్డు పనులు జరుగుతున్నాయని, 35 కమ్యూనిటీ హాళ్లు వచ్చాయని, పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.3,000 కోట్లతో రహదారులు మంజూరు అయ్యాయని వివరించారు.
యాత్ర సాగిందిలా..
తొలుత మండల పరిధిలోని ధరణికోట జేబీ గార్డెన్స్ వద్దకు మధ్యాహ్నం ఒంటిగంటకు బస్సుయాత్ర చేరుకుంది. వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలకు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వాగతం పలికారు.
● మధ్యాహ్నం 2 గంటలకు నియోజవర్గంలోని వ్యాపార, ఉద్యోగ, కుల సంఘాలు, మతపెద్దలతో నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. వినతులు తీసుకున్నారు.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, నందిగం సురేష్, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నియోజకవర్గ పరిశీలకుడు పైలా సోమినాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు.
● సాయంత్రం 4.30 గంటలకు నియోజవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రగా ముందుకు కదిలారు.
● హోసన్నా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు, మార్గం మధ్యలో రోడ్డుకిరువైపులా మహిళలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
● అమరావతి కచేరి సెంటర్లో పార్టీ జిల్లా కార్యదర్శి మంగిశెట్టి కోటేశ్వరరావు ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎంపీ విజయ సాయిరెడ్డి తదితర నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నేతలు 6.30 గంటలకు బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.