నాన్‌ లోకల్‌గా పోటీ.. ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!!

12 Dec, 2023 17:51 IST|Sakshi

జైపూర్‌: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే కాదు.. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ కొత్త స్ట్రాటజీని ప్రదర్శించింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుడ్ని, మధ్యప్రదేశ్‌లో బీసీ(యాదవ్‌)ని, అలాగే.. తాజాగా రాజస్థాన్‌లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తద్వారా సీనియర్లకు షాక్‌ ఇవ్వడంతో పాటు కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది బీజేపీ. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భజన్‌లాల్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. పైగా ఆయన గెలుస్తారని బీజేపీ శ్రేణులు కూడా అనుకోలేదట!. 

భజన్‌లాల్‌ శర్మ.. మొదటిసారి రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. చివరి నిమిషంలో సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చి.. అదే పేరును ప్రకటించింది బీజేపీ. అయితే ఆయన గెలవరని పార్టీ భావించిందట. అందుకు కారణం లేకపోలేదు. 

భజన్‌లాల్‌ స్వస్థలం భరత్‌పూర్‌. కానీ, ఆయనకు ఆ టికెట్‌ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్‌ టికెట్‌ ఇచ్చింది.  అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్‌ టికెట్‌ మీద పోటీ చేసి భజన్‌లాల్‌ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. 

భజన్‌లాల్‌ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీగా పనిచేశారు.

రాజకీయాల్లోకి రాకముందు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. 

ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్‌ లాల్‌ రాజస్థాన్‌ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు.

  56 ఏళ్ల భజన్‌లాల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు.     

ఇదీ చదవండి:  రాజస్థాన్‌ సీఎంగా ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే

>
మరిన్ని వార్తలు