మా పొత్తు జనసేనతో మాత్రమే

6 Apr, 2023 05:32 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  

సాక్షి, అమరావతి: బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే కలిసి ముందుకెళ్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటన, టీడీపీతో పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా.. సోము వీర్రాజు జవాబిచ్చారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకెళ్తాయని చెప్పారు.

అందువల్లే పవన్‌కళ్యాణ్‌ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిని కలిశారని పేర్కొన్నారు. పవన్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్‌ కలిసినంత మాత్రాన.. వాళ్లు రాజకీయంగా ఒక్కటైనట్టు కాదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబు వద్ద తాను కూడా కూర్చున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన కలిసి పోరాడతాయని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ వ్యూహం ప్రకారం జరగవన్నారు.  

మరిన్ని వార్తలు