ఆళ్లగడ్డ: రా..రమ్మన్నా.. రాని జనం.. చంద్రబాబు సభ అట్టర్‌ ఫ్లాప్‌

10 Jan, 2024 07:31 IST|Sakshi
బాబు ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలు

ఆళ్లగడ్డ సభకు లక్ష మందిని తరలించాలని జిల్లా నేతలకు టీడీపీ టార్గెట్

పదివేల మంది కూడా రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి

వచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెనుదిరగడంతో బాబు అసహనం

ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండానే సీఎం జగన్‌ కుటుంబం టార్గెట్‌గా సాగిన ప్రసంగం

ఆళ్లగడ్డ టికెట్‌ ప్రకటన చేయకపోవడంతో అఖిలప్రియ కార్యకర్తల ఆగ్రహం

సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వ­హి­స్తా­మని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వ­చ్చా­రు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలే­దు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపు­ల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనా­లను తరలించాలని ముందుగానే చెప్పినప్ప­టికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు.

రూ.2 కోట్లు వృథా..
సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చు­చేసి­నట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండి­పోయారు. సభపై జనాల­కు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమ­ని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు.

వైఎస్‌ జగన్‌ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబా­న్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడ­డం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.

కాబోయే సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్‌ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటు­చేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు.

అసహనానికి గురైన చంద్రబాబు
సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వ­హి­స్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం.  

whatsapp channel

మరిన్ని వార్తలు