కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్‌?

8 Oct, 2023 09:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే పార్టీలో భారీ చేరికలు నెలకొన్ని నేపథ్యంలో పార్టీ గెలుపుపై హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు కీలక స్థానం ఇచ్చే యోచనలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్‌ కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో, కూకట్‌పల్లిలో ఆయన బరిలో నిలుస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

మరోవైపు.. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం విషయంలో పొంగులేటి, తుమ్మల మధ్య చర్యలు కొనసాగుతున్నట్టు సమాచారం. నిన్న రాత్రి జానారెడ్డి ఇంట్లో భేటీ అయిన ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదురి.

ఇదిలా ఉండగా.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నేడు 60 నుంచి 70 స్థానాలకు కమిటీ సీట్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: అసమ్మతిపై హస్తం ముందుచూపు

మరిన్ని వార్తలు