చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు

29 Sep, 2023 18:42 IST|Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, రఘువీరా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం 2017లో​ గుంటూరులో సభ నిర్వహిస్తే చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించారు. కోర్టులో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి. చంద్రబాబు అరెస్ట్‌లో టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కాలేరు. ఆయన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారు. తాను తవ్విన గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. 

సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రఘువీరారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రెండు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన అనంతరం రాజకీయాలకు దూరమైపోయారు. సొంతూరిలోనే సాధారణ జీవితం గడిపారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అనూహ్యంగా రఘువీరారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పార్టీ ఎన్నికల పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఆనాడే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన బాధ్యతలను రఘువీరారెడ్డి చిత్తశుద్ధితో నెరవేర్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధిష్టానం వద్ద రఘువీరారెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: లోకేష్‌ లోకేషన్‌ ఎక్కడ? కార్లు మారుస్తూ రహస్య మీటింగ్‌లు!

మరిన్ని వార్తలు