మధిర: ప్రచారంలో తిరిగాం.. మా పైసలేవీ? ప్రచార రథం అడ్డగింత..ఉద్రిక్తత

15 Nov, 2023 16:57 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మధిర నియోజకవర్గ పరిధిలో ఇవాళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాన్ని కొందరు అడ్డుకున్నారు. ప్రచారానికి పిలిచి తమకు డబ్బులు ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వాహనాన్ని తగలబెడతామని హెచ్చరించడం స్వల్ఫ ఉద్రిక్తతలకు దారి తీసింది. 

మధిర నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ పోటీ చేస్తున్నారు. ఇవాళ చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారాయన. ఆ ప్రచారంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది పాల్గొన్నారు. ఎండలో బీఆర్‌ఎస్‌, కమల్‌రాజ్‌ అనుకూల నినాదాలతో ఊరంతా కలియతిరిగారు. ఆఖర్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్లు.

సర్పంచ్, జెడ్పీటీసీలే డబ్బులు పంచుకున్నారని.. తమకు పైసలు ఇవ్వకుండా గ్రామంలో వాహనం తిరిగితే తగలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకోగా.. స్థానికులు వాళ్లను సముదాయించడంతో ప్రచార రథం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు