తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. బాబు అది ఫిక్స్‌ అయిపోయారు: మంత్రి అంబటి

16 Dec, 2023 18:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: లోక కళ్యాణం కోసమే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని,  జైలుకు వెళ్లొచ్చాక ఆయనకు  మతిస్థిమితం పోయినట్లుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య చేసినట్టుగానే అద్భుతంగా పని చేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు వెంట పెట్టుకుని రావాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? 175 సీట్లు మా టార్గెట్. టీడీపీ, జనసేనని తుక్కుతుక్కుగా ఓడించే లక్ష్యంతో పని చేస్తున్నాం. 60% పైగా ప్రజలు మళ్ళీ జగనే కావాలంటున్నారు. మా మార్పుల గురించి అడుగుతున్నారు సరే.. మరి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేసిందెక్కడ? చంద్రగిరిలో చిత్తుగా ఓడిపోయాక కుప్పం ఎందుకు పారిపోయారు? మీ చిత్తూరు జిల్లాని కాదని లోకేషన్‌ మంగళగిరి లో ఎందుకు పోటీ చేయించారు’ అని అంబటి ప్రశ్నించారు. 

‘బాలకృష్ణ స్వస్థలం గుడివాడ కదా? మరి హిందూపురం ఎందుకు వెళ్లారు? పురంధేశ్వరి ఎందుకు సీట్లు మారుతున్నారు? వచ్చే ఎన్నికల తర్వాత చంద్రగిరి, మంగళగిరి వదిలి అబ్బాకొడుకులు శంకరగిరి మాణ్యాలకు పోవాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గౌరవం కల్పించింది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. మా పరిపాలన చూశాక ఇక జీవితంలో అధికారం రాదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. యువగళం ద్వారా లోకేష్ ఏమైనా నాయకుడయ్యాడా? రాజకీయంగా ఏమైనా ఎదిగాడా? యువగళం అట్టర్ ప్లాప్ అయింది’ అని అంబటి అన్నారు. 

‘పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి? గతంలో మీరు కలిసి పోటీ చేసి ఎందుకు విడిపోయారు? మీది కలహాల కాపురం అని తేలి పోయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ అసలు ఎక్కడ ఉంటారు? సీఎం ఐతేనే చంద్రబాబు అసెంబ్లీ కి వస్తారా? నాకు సీటు ఇవ్వకపోయినా పక్కచూపులు చూడను. జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను’ అని అంబటి స్పష్టం చేశారు. 

ఇదీచదవండి..‘నేనెందుకు జై పవన్ అనాలి?’.. అలిగి వెళ్లిపోయిన లోకేష్‌!

>
మరిన్ని వార్తలు