Minister Ambati Rambabu: ‘విషం మద్యంలో లేదు.. మీ  బుర్రలో ఉంది’

26 Jun, 2022 15:43 IST|Sakshi

మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు.
చదవండి: ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌..

‘‘తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్‌ కూడా కోల్పోయింది. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలుస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజార్టీ అందిస్తున్నారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. మద్యంలో కాదు.. టీడీపీ మెదడులోనే విషం ఉంది. టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే  పరిస్థితి లేదు. అందుకే ఈ కుట్రలు. టీడీపీ విష ప్రచారంతో మాపై ఉన్న అభిమానం తగ్గిపోదు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరు’’ అని అంబటి రాంబాబు అన్నారు.

‘‘మద్యంపై దుష్ట చతుష్టయం విష ప్రచారం చేస్తోంది. మద్యంలో విషపూరిత పదార్థాలు లేవని గతంలోనే తేలింది. విషం మద్యంలో లేదు.. మీ  బుర్రలో ఉంది. ప్రజలను వైఎస్సార్‌సీపీ పార్టీకి దూరం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర. బూమ్‌బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్స్‌ చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. మేము వచ్చాక ఒక్క డిస్టిలరీకి పర్మిషన్‌ ఇవ్వలేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆపడానికే టీడీపీ కుట్రలు. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మకూరులో మా విజయాన్ని ఆపలేకపోయారని’’ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

మరిన్ని వార్తలు