తెలంగాణ పాలపిట్ట కేసీఆర్‌

25 Oct, 2023 04:23 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా ఉండటం రాష్ట్రానికి శుభప్రదం: హరీశ్‌రావు 

రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏ మ్యాచ్‌ కావట్లేదు

కేసీఆర్‌ తలుచుకుంటే రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసేవారు

బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల టీమ్‌

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏ ఏంటో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాహుల్, రేవంత్‌ డీఎన్‌ఏలు మ్యాచ్‌ కావడం లేదన్నారు. బీజేపీపై పోరాడే డీఎన్‌ఏ తనదని చెప్పుకున్న రాహుల్‌.. రేవంత్‌ డీఎన్‌ఏ తెలుసుకోవాలని చెప్పారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత.. ఇటలీబొమ్మ అంటూ నోరు పారేసుకుని.. ఇప్పుడు సోనియాను దేవత అంటున్న రేవంత్‌ నోటికి మొక్కాలన్నారు. హరీశ్‌రావు మంగళవారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌లలో పర్యటించారు.

30న నారాయణఖేడ్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ సరిగ్గా ఇవ్వలేదని అసెంబ్లీలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని మండిపడ్డారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి అని దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్‌ ఎవ్వరికీ బీ టీమ్‌ కాదన్న హరీశ్‌.. తాము తెలంగాణ ప్రజల టీమ్‌ అని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ ఒక్కటి కాదంటూ.. నీళ్లు, నూనె కలుస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ తలుచుకుంటే రేవంత్‌ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసే వారన్నారు. కాంగ్రెస్‌ నేతలపై నాడు ఓటుకు నోటు కేసు ఉండగా.. నేడు నోటుకు సీటు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్‌ విమర్శించారు. 

కిషన్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయారు
పాలపిట్టను శుభప్రదంగా భావిస్తామని, తెలంగాణ పాలపిట్ట కేసీఆర్‌ రాష్ట్రానికి హ్యాట్రిక్‌ సీఎంగా ఉండటం కూడా అంతే శుభమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్య మకారులను తుపాకీతో బెదిరించిన రేవంత్‌రెడ్డి వంటి ద్రోహులు ఒకవైపు., రాష్ట్రం కోసం పద వులను త్యాగం చేసి, ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన కేసీఆర్‌ మరోవైపు ఉన్నార న్నారు. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయా లని డిమాండ్‌ వస్తే వెన్ను చూపి పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు