తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు

4 Nov, 2023 04:14 IST|Sakshi

పవన్‌కల్యాణ్‌ బీజేపీతో చేతులు కలిపారు  

ఓట్లు చీలొద్దని చంద్రబాబు లోపల నుంచి సపోర్టు చేస్తున్నారు  

రేవంత్‌ది క్రిమినల్‌ గ్యాంగ్‌.. సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌ ధ్వజం 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణను దెబ్బ తీయడానికి, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్, బీజేపీల ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌తో బీజేపీ చేతులు కలిపారు. షర్మిలమ్మ కాంగ్రెస్‌లో కలుస్తుందంటా.. వీరిద్దరూ తెలంగాణ ద్రోహులు కాదా.

తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ చేతులు కలిపింది. తెలంగాణ అంటే సిగరేటా.. బీడీనా అన్న షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందట. లోపల నుంచి చంద్రబాబు కూడా సపోర్టు చేస్తారంటా. ఓట్లు చీలవద్దని చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయబోమని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని అర్థమవుతోంది’అని విమర్శించారు.  

రేవంత్‌ క్రిమినల్‌ నం.4170 
తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్‌ పక్షాన నిలవాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్‌రెడ్డి క్రిమినల్‌ గ్యాంగ్‌కు మద్దతు ఇవ్వాలని హరీశ్‌రావు ఘాటుగా వాఖ్యానించారు. ఈ క్రిమినల్‌ గ్యాంగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డే క్రిమినల్‌. ఆయన క్రిమినల్‌ నం.4170 బెయి ల్‌ మీద బయట ఉన్న ఖైదీ రేవంత్‌  అని చెప్పారు. 

కాంగ్రెస్‌కు ఓటేస్తే తిప్పలు తప్పవు.. 
కాంగ్రెస్‌ పార్టీ రకరకాల కుట్రలతో బయలు దేరిందని, తప్పిపోయి ఆ పార్టీకి ఓటేస్తే తిప్ప లు తప్పవని హరీశ్‌రావు అన్నారు. ‘కర్ణాటకలో ఐదుగంటల కరెంటు కూడా ఉండటంలేదని వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. సాఫీగా కేసీఆర్‌ పాలన జరు గుతున్న ఈ తరుణంలో రిస్క్‌ ఎందుకో ఆలోచించుకోవాలి’అని ఆయన ప్రజలకు సూచించారు.]

ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్‌ వచ్చినప్పటికీ కిషన్‌రెడ్డి పదవి పట్టుకుని వేలాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్, టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు