రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్‌

8 Oct, 2022 13:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మంత్రి జగదీష్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్‌ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించగా.. తన కుటుంబ స్వార్థం కోసం రాజగోపాల్‌రెడ్డి రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌కు అమ్ముడుపోయారని జగదీష్‌ రెడ్డి కౌంటర్‌ అటాక్‌ చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ఒప్పుకున్నారని ప్రస్తావించారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా బీజేపీతో టచ్‌లో ఉన్నానని చెప్పి బీజేపీలో చేరాడని విమర్శించారు. దొరికిన దొంగ రాజగోపాల్‌ రెడ్డి అని, అతని వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. త్యాగాలు చేసినం అని చెప్పటం అంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని నిలదీశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను అంటున్న రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరితే ఏ అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 

‘పెద్ద పార్టీ వదిలి చిన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు అని మునుగోడు ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వలేక, బాగుపడుతున్న తెలంగాణాను చూసి తట్టుకోలేక బీజేపీ ఓ వ్యక్తిని కొనుక్కొని తెచ్చుకున్న ఉపఎన్నిక. రాజగోపాల్ చేసింది నీచమైన, నికృష్టమైన పని. మూడేళ్ళుగా కాంగ్రెస్ లో ఉండి, మోసం చేసి బీజేపీ లో చేరాడు. రాజగోపాల్‌ను ప్రజలు క్షమించరు. బీజేపీకి ఓటేస్తే బావుల దగ్గర మీటర్లు వస్తాయి. బీజేపీకి ఓటేస్తే కరెంట్ సంస్కరణలు, గ్యాస్ ధర ఇంకో వంద పెరుగుతుంది’ అని మంత్రి జగదీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
చదవండి: అభిమాని లేఖకు మంత్రి హరీశ్‌ రావు ఫిదా.. ఫోన్‌ చేసి ధన్యవాదాలు

మరిన్ని వార్తలు