రేపటి నుంచే వై ఏపీ నీడ్స్‌ జగన్‌: ‘బాబు మోసాన్ని వివరిస్తాం.. జగన్‌ మంచిని గుర్తు చేస్తాం’

8 Nov, 2023 20:38 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: రేపటి(గురువారం) నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్ది పాల్గొన్నారు.

చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను సీఎం జగన్ గాడిలో పెట్టారని, అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ చేరుకుందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు ద్వారా 11 వే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ‘నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మించామని మంత్రి కాకాణి అన్నారు.

‘‘మేనిఫెస్టోను మాయం చేసి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు చేసిన మంచిని వారికి తెలియజేసేందుకు ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.డీబీటీ ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం. వైఎస్సార్‌సీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. 2024లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగా పని చేయాలని మంత్రి కాకాణి పిలుపునిచ్చారు.
చదవండి: సొంత జిల్లాకు సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన

మరిన్ని వార్తలు