సాక్షి, అమరావతి: సినీ నటుడు మోహన్బాబుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని.. ఆయన వ్యక్తిగతంగా కాఫీకి ఆహ్వానించారని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోహన్బాబు పిలిస్తేనే వాళ్లింటికి వెళ్లానని నిన్నటి సమావేశంపై సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్ల లేదన్నారు. బొత్స కుమారుని వివాహం తర్వాత మోహన్బాబు ఇంటికి వెళ్లానన్నారు. ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేందుకు వెళ్లలేదన్నారు. సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు చేసిందేమీ లేదని.. ప్రతిదానికీ దిగజారుడు రాజకీయాలు చేయడమే పని అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
చదవండి: ‘అశోక్బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’
‘‘ టిక్కెట్ల వ్యవహారం మీద సమస్య సృష్టించిందే చంద్రబాబు.. దాన్ని పరిష్కరించింది సీఎం జగన్. బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసిందే చంద్రబాబు. సినీ పరిశ్రమకు అసలు చంద్రబాబు ఏం చేశారు? వారిని రాజకీయాలకు వాడుకోవటం తప్ప ఏమీ చేయలేదు. నిన్న చర్చలకు వచ్చిన సినిమా వాళ్లకు మా పార్టీతో ఏమైనా సంబంధం ఉందా?. ఇక్కడకి వచ్చిన వారెవరికీ మా పార్టీలో సభ్యత్వం లేదు. సినిమా వాళ్ల సమస్యలు పరిష్కరించటమే మా ఉద్దేశం. ప్రభుత్వ సహకారానికి సినిమావాళ్లంతా సంతోషించారని’’ పేర్ని నాని పేర్కొన్నారు.