లాక్‌డౌన్‌పై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు

7 May, 2021 14:14 IST|Sakshi

కోవిడ్ విప‌త్తుపై కేంద్రానికి రాహుల్ లేఖ

వైర‌స్ దేశానికే కాదు.. ప్ర‌పంచానికే ముప్పు

శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్ నిర్వ‌హించాలి: రాహుల్‌

న్యూఢిల్లీ: కోవిడ్ విప‌త్తుపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి.. కరోనాతో దెబ్బతిన్నవారికి ఆర్థిక సాయం అందజేయాలి అని రాహుల్ ప్రధానికి రాసిన లేఖ‌లో కోరారు. "సెకండ్ వేవ్ సునామీలో దేశం విలవిల్లాడుతోంది. అధికారాన్ని ఉపయోగించి ఏం చేసైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలి. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక మ్యుటేషన్లకు గురవుతోంది. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు" అని రాహుల్ ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో తెలిపారు. 

"వైరస్ మ్యుటేషన్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేయాలి. కొత్త మ్యుటేషన్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలి. దేశ జనాభా మొత్తానికి మెరుపువేగంతో వ్యాక్సినేషన్ చేయాలి. మన అధ్యయనాల ఫలితాలను పారదర్శకంగా మిగతా ప్రపంచానికి తెలియజేయాలి. ప్రభుత్వానికి వ్యాక్సినేష‌న్‌పై స్పష్టమైన ప్రణాళిక లేదు. అలాగే విజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారు. ఫలితంగా దేశం అత్యంత ప్రమాదభరిత స్థితికి చేరుకుంది" అని రాహుల్ లేఖ‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

"ఈ విపత్తు అన్ని వ్యవస్థలు, యంత్రాంగాల సామర్థ్యాన్ని మించి సవాల్ విసురుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు మన‌ దేశాన్ని మరో సంక్షోభంలోకి నెట్టి నేషనల్ లాక్‌డౌన్ దిశగా తీసుకెళ్తున్నాయి. దేశ ప్రజలకు తగిన ఆహార, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలి. లాక్‌డౌన్ వల్ల‌ జరిగే ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మహా విషాదకర సంక్షోభంలోకి దేశం వెళ్తుంది. ఈ సమయంలో అందరినికీ కలుపుకుని ముందుకెళ్లాలి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్ర‌భుత్వానికి మా మద్ధతు పూర్తిగా ఉంటుంది" అని రాహుల్ తెలిపారు. 

చ‌ద‌వండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం

>
మరిన్ని వార్తలు