పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్‌ మాన్‌..!

17 Mar, 2022 16:44 IST|Sakshi

ఛండీగఢ్‌ : ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ మెజార్జీ సాధించి.. జాతీయ పార్టీలకు షాకిచ్చింది. ఈ క్రమంలో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఆప్‌ ప్రభుత్వం ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఘటన పంజాబ్‌ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే, బుధవారం పంజాబ్‌ ముఖ‍్యమంత్రిగా భగవంత్‌ మాన్‌.. ఖట్కర్‌ కలాన్‌ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భగవంత్‌ మాన్‌.. సీఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. సీఎం భగవంత్‌ మాన్‌ సంతకం పెడుతున్న సందర్భంగా సీఎం వెనుకల గోడపై భగత్‌ సింగ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటోలు మాత్రమే కనిపించాయి. కాగా, సీఎం ఆఫీసులో షేర్‌ ఏ పంజాబ్‌ మహారాజా రంజిత్‌ సింగ్‌ ఫొటోను తొలగించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో బీజేపీ పంజాబ్‌ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ శర్మ మాట్లాడుతూ.. బీఆర్‌ అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలు పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, మహారాజా రంజిత్‌ సింగ్‌ చిత్రాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, అంతకు ముందు పంజాబ్‌కు సీఎంలుగా పనిచేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ సమయంలో ఆఫీసులో రంజిత్‌ సింగ్‌ ఫొటో ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు