-

హామీలు నెరవేర్చే చరిత్ర కాంగ్రెస్‌దే 

28 Nov, 2023 02:57 IST|Sakshi

ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని వర్గాలకు అనుకూల పాలన 

ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు మేం సిద్ధం 

డోర్నకల్‌ సభలో రేవంత్‌రెడ్డి 

మరిపెడ: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చే చరి త్ర కాంగ్రెస్‌ది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందించాలంటే అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం’అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడలో నిర్వహించిన ప్రజా విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగులు మార్చే మోసగాడని.. ఈసారి ఆయనకు ఓటు తో బుద్ధిచెప్పాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు నోటిదురు సు వల్లే రైతులకు రైతుబంధు సొమ్ము జమకాకుండా పోయిందని రేవంత్‌ విమర్శించారు. వచ్చే నెలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏటా 12 వేలు అందిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. 

ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్‌ పేటెంట్‌... 
ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని... 2004లోనే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారని రేవంత్‌ గుర్తుచేశారు. ఆ రోజుల్లోనే ఉచిత విద్యుత్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఇవ్వదని బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులకే కాకుండా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

ఇల్లెందులో రోడ్‌ షోకు రేవంత్‌ దూరం 
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం జరిగే రోడ్‌ షోలో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి రేవంత్‌ పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పాల్గొనలేకపోయారు. హైదరాబాద్‌ నుంచి రేవంత్, ఖమ్మం నుంచి పొంగులేటి వేర్వేరు హెలికాప్టర్లలో ఇల్లెందు వరకు చేరుకున్నారు. తొలుత పొంగులేటి హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవగా ఆ తర్వాత రేవంత్‌ హెలికాప్టర్‌కు సిగ్నల్‌ లభించక పోవడంతో పొంగులేటి ఒక్కరే ప్రసంగించారు.  

మరిన్ని వార్తలు