‘బండి సంజయ్‌ వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి’

2 May, 2021 17:40 IST|Sakshi

సాక్షి: హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు చూస్తే సమాజమే సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. హుందాతనం, పార్టీ అధ్యక్షుడు అన్న విషయం మర్చిపోయి మాట్లాడారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడే ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నీ స్థానం ఏంటని, మా స్థానం ఏంటి అని నిలదీశారు. తెలంగాణ కోసం కొట్లాడింది మేమని, ఉద్యమంలో కాల్చి చంపుతామన్న కూడా గుండెలు ఎదురుపెట్టామని పేర్కొన్నారు. మీరు ఎవరైనా జైలుకు వెళ్ళారా అని, ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు.

తాము ప్రధానమంత్రిపై ఇప్పటి వరకు అసభ్యంగా మాట్లాడలేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వేల ఎకరాలు కబ్జా చేశారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము కొన్న భూమికి పాస్ బుక్ ఉందని, తమ సర్వే నంబర్‌లో ఉన్న భూమి కంటే ఒక్క గజం ఎక్కువ ఉన్న తన ఆస్తి మొత్తం రాసిస్తానని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్లు స్థలాలు తప్పైతే తన పదవికి రాజీనామా చేస్తానని, తప్పని తేలితే నువ్వు ఎంపీగా రాజీనామా చేస్తావా అని సవాల్‌ విసిరారు.

చదవండి: సంజయ్‌.. నోరు అదుపులో పెట్టుకో! 

మరిన్ని వార్తలు