పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

19 Mar, 2024 04:16 IST|Sakshi
శ్రీరంగనాథరాజు సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ, సీపీఎం నాయకులు

పార్టీలో చేరిన టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నేతలు, కార్యకర్తలు

పెనుగొండ/దెందులూరు/భీమవరం/ఏలూరు (టూటౌన్‌)/పాలకోడేరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పెనుగొండ మండలం తూర్పుపాలెంలో బీజేపీ, సీపీఎం నేతలకు మాజీ మంత్రి రంగనాథరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. 2019లో ఆచంట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏడిద కోదండ చక్రపాణి, సీపీఎం నేత గుర్రాల సత్యనారాయణతో పాటు పలువురు పార్టీలో చేరారు. గుర్రాల సత్యనారాయణ పెనుగొండ పట్టణ కార్యదర్శి గాను, రైతు సంఘ నాయకుడు గాను వ్యవహరించారు.

కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు మండల అధ్యక్షుడు కంచర్ల గంగాధరరావు, గౌడ సంఘం అధ్యక్షుడు బెజవాడ సత్తిబాబు, ఆ పార్టీ నేతలు దంపనబోయిన రామచంద్రరావు, కొల్లేటి శంకర్‌ తదితరులు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరవాసరం మండలం మత్స్యపురి, భీమవరం పట్టణంలోని 2,36 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏలూరు 29వ డివిజన్‌ కుమ్మరి రేవుకు చెందిన 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కార్పొరేటర్‌ సన్నీ, వైఎస్సార్‌సీపీ నేత యలమర్తి సతీష్ ల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

వీరంతా కుమ్మరి రేవు ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ది రమణమ్మ, ఉద్దడం రవళి ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంకి చెందిన 60 మందికి పైగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహరాజు సమక్షంలో పార్టీలో చేరారు.

Election 2024

మరిన్ని వార్తలు