తెలంగాణలో భారీగా నామినేషన్ల ఉపసంహరణ.. గజ్వేల్‌లో ఏకంగా..

15 Nov, 2023 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారులు తెలియజేశారు. బుజ్జగింపుల పర్వం, చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్‌ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. గజ్వేల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌లో రెబల్స్‌తో అధిష్టానం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చాలా స్థానాల్లో రెబల్స్‌ తమ నామినేషన్స్‌ వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌రెడ్డి, జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూనాయక్‌, వరంగల్‌ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

మరోవైపు బీజేపీ రెబల్స్‌ సైతం భారీ సంఖ్యలోనే నామినేషన్లు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.

నామినేషన్ల పరిశీలన తర్వాత.. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. 

  • సూర్యాపేటలో 12 మంది ఉపసంహరణ.. బరిలో 20 మంది

సిద్ధిపేట జిల్లా..

  • హుస్నాబాద్‌లో 15 నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 19 మంది           

  • హుజూరాబాద్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. ఎన్నికల బరిలో 22 మంది


రాజన్న సిరిసిల్ల  జిల్లా..

  • సిరిసిల్లలో ఇద్దరి నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది 
  • వేములవాడలో నలుగురి ఉపసంహరణ.. బరిలో 16 మంది


పెద్దపల్లి జిల్లాలో..

  • మంథనిలో ముగ్గురు ఇండిపెండెంట్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది అభ్యర్థులు

నల్లగొండ జిల్లా.. 

  • మిర్యాలగూడలో 10 మంది విత్‌డ్రా.. బరిలో 23 మంది
  • నల్లగొండ నాగార్జున సాగార్‌లో ఆరుగురు సభ్యుల విత్‌డ్రా.. బరిలో 15 మంది

నిజామాబాద్‌ జిల్లాలో.. 

  • ఆర్మూర్‌లో 21 మంది
  • బాన్సువాడలో 17 మంది
  • బోధన్‌ బరిలో 15 మంది
  • నిజామాబాద్‌ అర్బన్‌లో 23 మంది
  • నిజామాబాద్‌ రూరల్‌లో 17 మంది
  • బాల్కొండ బరిలో 9 మంది


కామారెడ్డి జిల్లాలో.. 

  • కామారెడ్డి సెగ్మెంట్‌లో 58 నామినేషన్లలో 19 విత్‌డ్రా.. బరిలో 39 మంది
  • గజ్వేల్‌తో పాటు సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి

  • నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఈ నియోజకవర్గంలో 58 మంది పోటీలో ఉండగా.. ఇవాళ 19 మంది నామినేషన్ల ఉపసంహరణ

  • కామారెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో

  • జుక్కల్‌లో 7 విత్‌డ్రా.. బరిలో 16 మంది

ఉమ్మడి వరంగల్‌..  12 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 216 మంది పోటీ

  • వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు.
  • పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు.
  • వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు
  • నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు.
  • జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు.
  • పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు.
  • స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు.
  • ములుగు బరిలో 9మంది అభ్యర్థులు.
  • భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు.
  • మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు
  • డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు
  • వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

  • పినపాకలో నలుగురు ఉపసంహరణ.. బరిలో 18 మంది 
  • ఇల్లందులో 10 మంది ఉపసంహరణ.. పోటీలో 20 మంది
  • కొత్తగూడెంలో నలుగురు ఉపసంహరణ.. పోటీలో 30 మంది
  • అశ్వారావుపేటలో ఏడుగురి ఉపసంహరణ.. 14 మంది పోటీలో
  • భద్రాచలంలో ఎవరూ విత్‌డ్రా చేసుకోలేదు. దీంతో 13 మంది పోటీ లో ఉన్నారు 

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో.. 

  • 15 స్థానాలకు 20 మంది అభ్యర్థుల ఉపసంహరించుకోగా.. 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  


రంగారెడ్డి జిల్లాలో.. 

  • 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు బరిలో
  • ఇబ్రహీంపట్నంలో 28 మంది,
  • ఎల్బీనగర్‌లో 38 మంది,
  • మహేశ్వరంలో 27,
  • రాజేంద్రనగర్‌లో 25,
  • శేరిలింగంపల్లిలో 33,
  • చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మరిన్ని వార్తలు