మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం

22 Oct, 2023 03:04 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ పోస్ట్‌కు రేవంత్‌ కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజే పీ శిష్యరికంతో రాష్ట్ర మంత్రి కేటీరామారావు అసత్య ప్రచారాల్లో రాటుదేలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ చూసి ఏం చేయాలో అర్థంకాక కోట్లాదిరూపాయలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని రైతులకు విద్యుత్‌ సరఫరాపై మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా చేసిన పోస్ట్‌కు శనివారం ఆయన కౌంటర్‌ పోస్ట్‌ చేశారు.

‘నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మిత్రపార్టీ బీజేపీ 40% కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ‘తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ దూసుకెళుతుంటే ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ప్రజలు మీ తోడుదొంగల దుమ్ము దులపడం ఖాయం. కాంగ్రెస్‌ వస్తుంది. తెలంగాణ గెలుస్తుంది’ అని రేవంత్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు