'గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు'

4 Oct, 2021 12:06 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా: బద్వేల్‌ ఉపఎన్నికపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని బూత్‌ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ భేటీ అయ్యారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలం సురేష్‌ మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 ఎన్నిక తరహాలోనే ఉపఎన్నికల్లో కూడా డాక్టర్‌ సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు మద్దతుగా నిలవాలి.

టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే. ప్రజాదరణ పొందుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లడమే. ఎన్నికలు కొత్త కాదు. పంచాయితీ, స్థానిక సంస్థల్లో విజయం సాధించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయి. ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఆదరణ లభిస్తోంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. 90 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనట సీఎం జగన్‌ది అని అన్నారు. 

చదవండి: (దేవదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ) 

రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు
ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం తెలియజేయాలి. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్‌కు నీటిని తరలించి కరవు పరిస్థితిలో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నాము. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నాం.

బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు ఎల్‌ఎస్పీ కాలువ విస్తరణ చేపడుతున్నాం. బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేస్తున్నాం. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1,000 కోట్లతో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ రాబోతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి డాక్టర్ సుధాను భారీ మెజారిటీతో గెలిపించాలి' అని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కోరారు. 

మరిన్ని వార్తలు