గుంటూరు సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ నేతలు

26 Oct, 2023 19:59 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేసిన పనుల్ని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలని, జగనన్న సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆ దమ్ముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గురువారం సాయంత్రం తెనాలి మార్కెట్ సెంటర్‌లోని అన్నాబత్తుని పురవేదికకు వద్ద అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీకి చెందిన అన్ని వర్గాల నేతలు ప్రసంగించారు. 

పూలే,అంబేద్కర్, వైఎస్సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. 40 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు. స్కిల్ స్కామ్ లో దొరికిపోయి.. జైల్లో ఉండి కూడా బాబు బుకాయిస్తున్నాడు. నారా భువనేశ్వరికి ఇదే నా సూటి ప్రశ్న. మీ తండ్రిని వెన్నుపోటు పొడిస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు. మీ దుర్మార్గపు రాజకీయాల కోసం ప్రజల్ని వాడుకోవద్దని కోరుతున్నా. సామాజిక సాధికారత కోసం గతంలో ఎన్నోపోరాటాలు జరిగాయి. ఉద్యమాలు, పోరాటాలు లేకుండానే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్‌. మహిళలను పసుపు కుంకుమ పేరుతో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలకు సాధికారత చేకూర్చిన మనసున్న నాయకుడు జగన్. మహిళలకు రాజకీయంగా సాధికారత కల్పించిన ఘనత జగనన్నదే. జగనన్నకు మనమంతా సైనికుల్లా నిలబడాలి
:::ఎమ్మెల్సీ పోతుల సునీత


75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రతీ పార్టీలు ఎన్నికల్లో తీపికబుర్లు చెప్పడం తర్వాత మోసం చేయడం చూశాం. గతంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఎంతో అన్యాయం జరిగింది. టీడీపీ సమయంలో జన్మభూమి కమిటీలను తృప్తి పరిస్తేనే పథకాలు అందేవి. ఎవరైనా చనిపోతేనే పెన్షన్ ఇచ్చేవారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు. చంద్రబాబు వందల ఎకరాలను వారికి కావాల్సిన వారికి కట్టబెట్టేవారు. ఆశ్రమాలు కట్టుకునే వారికి కేటాయించేవారు. పట్టుమని పేదలకు పది ఎకరాలు కొని ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. కానీ బీసీలకు పెద్దపీట వేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. సమాజంలో ఉన్న అన్ని వనరులను సమానంగా పంచడమే సామాజిక సాధికారిత. 32 లక్షల మందికి సొంతింటి కల నెరవేర్చిన మగాడు జగన్ మోహన్ రెడ్డి. కరోనా టైంలో వాలంటీర్ల ద్వారా ప్రతీ ఒక్కరికీ పథకాలను అందించిన గొప్ప నాయకుడు జగన్. రాయపాటి సాంబశివరావుకో...కోట్లు ఖర్చు చేసిన వారికో చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదలయాత్ర జరుగుతోంది. ఈయాత్ర ద్వారా రాష్ట్రంలోని పేదలంతా ఏకమవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని మనమంతా మళ్లీ గెలిపించుకోవాలి
:::ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి

ప్రతీ బీసీ, ఎస్సీ, ఎస్టీ తమకొక గుర్తింపు కావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. గత ప్రభుత్వాలు బీసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. వెనకబడిన వర్గాలకు మంచి చేయాలన్న ఆలోచన చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం,ప్రాధాన్యత దక్కింది. నాలుగున్నరేళ్లలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. మహిళలకు సాధికారత కల్పించి తలెత్తుకు తిరిగేలా చేశారు. పేదరికంలో ఉన్నామన్న భావనను తొలగించారు. అమ్మఒడి,నాడు-నేడు ద్వారా పేదలకు విద్యావకాశాలు కల్పించారు. గతంలో అరకొరగా పథకాలిచ్చి మార్కెటింగ్ చేసుకునేవాళ్లు. జగన్ మోహన్ రెడ్డి పేదల ఇంటి వద్దకే పథకాలు అందించి మేలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా ఉండాలి. మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాలి. 
:::మాజీ ఎంపీ బుట్టా రేణుక

జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. మధ్యవర్తి లేకుండా నేరుగా పేదలకే లబ్ధి చేకూరుస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మాదిరి మరే సీఎం బీసీలకు మేలు జరగలేదు. నాలుగున్నరేళ్లలో చేసిన పనులు చెప్పి ప్రజల్లోకి బస్సుయాత్ర చేయడానికి ధైర్యం కావాలి. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. 
:::ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కామాణిక్య వరప్రసాద్

నాలుగున్నరేళ్లలో చేసింది చెప్పేందుకు సామాజిక సాధికారయాత్ర చేస్తున్న దమ్మున్న నేత జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల పార్టీ వైఎస్సార్సీపీ. మూడు ప్రాంతాల్లో బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు బస్సుయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకే ఇచ్చారు. 2లక్షల 31వేల కోట్లు బటన్ నొక్కి పేదలకు పంచిన మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వార్డు మెంబర్లుగా కూడా నోచుకోలేని మనల్ని మంత్రుల్ని చేశారు. అమ్మా భువనేశ్వరమ్మా...నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు బొక్కలోకి వెళ్లాడమ్మా. మీనాన్నకు వెన్నుపోటు పొడిచింది నీకే కదమ్మా తెలుసు. బస్సుయాత్రలోనైనా నిజం చెప్పమ్మా!. రెండెకరాలతో రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పమ్మా. హరికృష్ణ,తారకరత్నను ఎలా వాడుకున్నారో నువ్వే చెప్పాలమ్మా?.  
మా నాయకుడు జగనన్న దమ్మున్న మగాడు. ఒకడు మీసాలు మెలేస్తాడు.. తొడలు కొడతాడు. 175 సీట్లలో పోటీ చేయమంటే జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టడం నా వల్ల కాదంటాడు. మీరంతా సినిమాల్లోనే హీరోలు. రాజకీయాల్లో కామెడీ ఆర్టిస్టులు. చంద్రబాబు,దత్తపుత్రుడు,ఉత్తపుత్రుడు కలిసి వచ్చినా జగనన్నను ఏం చేయలేరు. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 గెలవబోతున్నాం రాసిపెట్టుకోండి. జగన్ మోహన్ రెడ్డిని మనమంతా కాపాడుకోవాలి. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. 
::: మంత్రి జోగిరమేష్


జగనన్న కటవుట్ చూస్తేనే వేలమంది జనం మన మీటింగ్ లకు వస్తున్నారు. అదే జగనన్నే రోడ్డుమీదకు వస్తే.. ఆ సునామీలో టీడీపీ,జనసేన భూస్థాపితం అవ్వడం ఖాయం. రాబోయే రోజుల్లో జగనన్నకు ముందు జగనన్న తర్వాత పుస్తకాలు రాబోతున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తున్న జగనన్న మీద రోజూ బురద జల్లుతున్నారు. మన జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరం లేదు. లోకల్ గా మనమధ్య ఉండే వారే మనకు కావాలి
:::ఎమ్మెల్యే,హఫీజ్ ఖాన్


గత పాలకులు కులాల మధ్య చిచ్చుపెట్టి ఆర్ధిక అతమానతలు సృష్టించారు. బీసీ,ఎస్సీలు మీరింతే .. మాకు ఓట్లకోసమే పనిచేస్తారని వాడుకున్నారు. అందరినీ సమానంగా చూస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేశారు. సమసమాజ స్థాపన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. సమసమాజ స్థాపన చేసే నాయకుడి కోసం ఎదురు చూశారు. మేం ఎదురుచూసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి రూపంలో వచ్చారు. అంబేద్కర్ భావజాలం కలిగిన నాయకుడు జగన్. జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో సమ సమాజ స్థాపనకు అడుగులు పడ్డాయి. మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం,సాధికారత చేసి చూపించిన నేత సీఎం జగన్‌. ఆలయాల్లోకి ప్రవేశం లేని పరిస్థితుల నుంచి ఆలయాల్లో పాలకమండలి సభ్యులుగా ఎదిగామంటే అదీ జగన్‌ తీసుకున్న చొరవ. అవినీతికి తావులేకుండా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 80% హామీలు నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. ప్రభుత్వం జవాబుదారీ తనంతో ఎలా పనిచేస్తుందో ప్రజలకు వివరించేందుకే ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తమ వ్యాపారాల కోసం నారా భువనేశ్వరి యాత్ర. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. గంటకు లక్షలు ఖర్చు పెట్టే లాయర్లు పెట్టుకుని కూడా చంద్రబాబు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు. గతంలో స్టేలు తెచ్చుకుని బయటికి వచ్చినపుడు చంద్రబాబుకు కోర్టులు మంచివన్నారు. ఇప్పుడు అదే కోర్టులను తప్పుబడుతున్నారు. ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డే శాశ్వత ముఖ్యమంత్రి. రాబోయే కురుక్షేత్రంలో పేదల పక్షాన జగనన్న నిలిచారు. పెత్తందారుల పక్షాన ప్రతిపక్షాలున్నాయి. ఎప్పుడూ చట్టసభలను చూడని కులాల్లోని వారిని కూడా చట్టసభలకు పంపించిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. 
:::మంత్రి ఆదిమూలపు సురేష్

జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎవరూ చేయలేనంత అభివృద్ధి తెనాలికి జరిగింది. 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. జగన్ మోహన్ రెడ్డి కులాన్ని చూడలేదు. పేదవాడిని చూసి మేలు చేశారు. తెనాలిలో నెలకు పది కోట్ల రూపాయలు ఒకటో తేదీన పింఛన్లు ఇస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లేయమని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. సామాజిక సాధికారత చేశారు కాబట్టే జగన్ మోహన్ రెడ్డి దమ్ముగా చెప్పగలుగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడని విమర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కింది రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల కోసమే. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలు సంక్షేమం రూపంలో అందించారు. ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి...పంచింది మేము...తీసుకున్నది జనం. ఇందులో ఎక్కడైనా అబద్ధముందా?. నేను చెప్పిన లెక్క కరెక్ట్ కాదని ఎవరైనా చెబితే మళ్లీ పోటీ చేయను. ఈ రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సుయాత్ర చేసే దమ్ము వైసీపీ పార్టీకే ఉంది. జగన్ మోహన్ రెడ్డికి మేం అండగా ఉంటాం.. మళ్లీ గెలిపిస్తాం. ఈ దేశంలో సంక్షేమ క్యాలెండర్ తెచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. తెనాలి గడ్డ జగనన్న అడ్డా. మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. వైనాట్ 175 కి తెనాలి నుంచి నాంది పలుకుతున్నాం. 
::: అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే

సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారు రోశయ్య, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు