ఎన్నికలొస్తేనే.. ఫాంహౌస్‌ నుంచి బయటికొస్తారు: వైఎస్‌ షర్మిల

4 Sep, 2022 02:23 IST|Sakshi
లింగోటం శివారులో వ్యవసాయ కూలీలతో మాట్లాడుతున్న షర్మిల 

అచ్చంపేట: ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చే సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం క్యాంపు నుంచి ప్రారంభమైంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయనందుకు నిరసనగా నల్లబ్యాడ్జీ ధరించి ఆమె పాదయాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో ఎనిమిదేళ్లుగా చెప్పుకోదగ్గ పథకం ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా రైతులను డిఫాల్టర్లు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఉనికిని కాపాడుకోవాలనే స్వార్థంతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు 60 ఏళ్లు వస్తే రైతు బీమా వర్తించదు గాని.. కేసీఆర్‌ మాత్రం 69 ఏళ్ల వయసులోనూ సీఎం పదవి అనుభవించాలా?

అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాల మూరు ప్రాజెక్టుపై లేదన్నారు. 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పాల మూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, ఇందుకోసం పోరా టం మొదలుపెడతామని చెప్పారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లిక్కర్, ఇసుక దందా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు