ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన సబిత.. మంత్రిగా ఘనత.!

7 Nov, 2023 08:58 IST|Sakshi

అమాత్య పదవుల్లో సరికొత్త రికార్డు!

భర్త మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి..

కేఎల్‌ఆర్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగు!

సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల చెల్లెమ్మగా.. తొలి మహిళా హోం మంత్రిగా... గెలిచిన ప్రతీసారి మంత్రి పదవి చేపట్టి ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ప్రత్యేకంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె మహేశ్వరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి. భర్త మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

► ఉమ్మడి రాష్ట్రంలో 1999లో సబితారెడ్డి భర్త పి.ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఎల్‌ఆర్‌పై విజయం సాధించారు. 2000లో ఆయన అకాల మరణంతో ఆమె అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆమె కేఎల్‌ఆర్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టింది.
► 2004లోనూ పోటీలో నిలిచిన ఆమె టీడీపీ అభ్యర్థి ఎస్‌.భూపల్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఆమె మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని గనుల శాఖ మంత్రిగా మెప్పించారు.
► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితారెడ్డి మూడోసారి బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్‌ఆర్‌ ప్రోత్సహించి ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టడంతో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అనంతరం 2014 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు.
► 2018 ఎన్నికల్లో మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేసిన సబితారెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆమె గులాబీ తీర్థం పుచ్చుకుని సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా రికార్డుల నెలకొలిపారు. 2023 ఎన్నికల్లో ఆమె కారుగుర్తుపై ఎన్నికల పోటీలో ఉన్నారు.
ఇవి చదవండి: ‘పట్నం’లో టైట్‌ ఫైట్‌! కాంగ్రెస్‌ నలభై ఏళ్ల కల.. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కోసం వల!

మరిన్ని వార్తలు