సైబర్‌ వలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. మెసేజ్‌ క్లిక్‌ చేయ‌గానే బిగ్ షాక్‌!

4 Jan, 2024 09:35 IST|Sakshi

టాస్క్‌లు, కమీషన్‌ల పేరుతో మోసం

రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న వైనం

మరో ఇద్దరు బాధితుల నుంచి రూ.2.07 లక్షలు వసూలు

పటాన్‌చెరు: సైబర్‌ వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ పరిధిలోని గ్రీన్‌విలాస్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పార్ట్‌ టైం జాబ్‌ అంటూ డిసెంబర్‌ 18వ తేదీన వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్‌ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్‌ ఐడీ క్రియేట్‌ చేసి ఇచ్చారు.

ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్‌ నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్‌ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్‌పూర్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కరెంట్‌ బిల్లు లింక్‌ క్లిక్‌ చేసి..
అదే విధంగా అమీన్‌పూర్‌ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్‌ 2వ తేదీన విద్యుత్‌ బిల్‌ కట్టలేదని ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్‌ లింక్‌ను క్లిక్‌ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్‌ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పర్సనల్‌ లోన్‌ ఇప్పిస్తానని..
అమీన్‌పూర్‌ మండల పరిధిలోని పటేల్‌గూడా సిద్ధార్థ నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్‌లోన్‌ ఇస్తామంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్‌ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫేస్‌బుక్‌లో స్కూటీ కొందామని..
హత్నూర( సంగారెడ్డి): ఆల్‌లైన్‌ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్‌ నవీన్‌ మంగళవారం ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్‌కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్‌ అమ్మకందారుడి ఫోన్‌ పే నంబర్‌కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్‌లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్‌ చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి చ‌ద‌వండి: జులాయిగా తిరుగొద్దని మందలించ‌డంతో యువ‌కుడి విషాదం! వాట్సాప్ స్టేట‌స్‌లో

>
మరిన్ని వార్తలు