ICC Mens Player Of The Month: ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో వరల్డ్‌కప్‌ హీరోలు

7 Nov, 2023 13:05 IST|Sakshi

ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రేసులో వన్డే వరల్డ్‌కప్‌ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా), రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), జస్ప్రీత్‌ బుమ్రా (భారత్‌) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్‌ నెలతో పాటు  ప్రస్తుత మాసంలోనూ (నవంబర్‌) కొనసాగుతుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు.

అక్టోబర్‌ 5న మొదలైన వరల్డ్‌కప్‌ 2023లో డికాక్‌ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్‌ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో టీమిండియా పేస్‌ గన్‌ జస్ప్రీత్‌ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్‌కప్‌ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్‌ నెల పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలతో పాటు మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్‌ హేలీ మాథ్యూస్‌, బంగ్లాదేశ్‌ నహీద అక్తర్‌, న్యూజిలాండ్‌ అమేలయా కెర్‌ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఆసీస్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు​ పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్‌కు గురయ్యాయి. నెదర్లాండ్స్‌ అధికారికంగా ఎలిమినేట్‌ కానప్పటికీ, సెమీస్‌ అవకాశాలు దాదాపుగా లేనట్లే. ‌

మరిన్ని వార్తలు