శ్రీలంకతో మ్యాచ్‌.. కివీస్‌ను కలవరపెడుతున్న గతం.. మరోవైపు వరుణ గండం

9 Nov, 2023 12:52 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 9) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ శ్రీలంకకు నామమాత్రమే కాగా.. సెమీస్‌ రేసులో ఉన్న న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఇందులో న్యూజిలాండ్‌ భారీ తేడాతో గెలిస్తే పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది. 

బలాబలాలు, ప్రస్తుత ఫామ్‌ ప్రకారం కివీస్‌తో పోలిస్తే శ్రీలంక బలహీనమైన ప్రత్యర్దిగా ఉంది కాబట్టి, ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌ను రెండు అంశాలు కలవరపెడుతున్నాయి. అందులో ఒకటి వరుణ గండం​ కాగా.. రెండోది శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్‌.

వరుణ గండం విషయానికొస్తే.. లంకతో మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఒకటి, రెండుసార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అ

యితే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడం కివీస్‌కు అంత మంచిది కాదు. పూర్తి మ్యాచ్‌ జరిగితేనే ఆ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కివీస్‌ ఎంత బాగా ఆడినా వరుణుడు అడ్డుతగిలితే ఏమవుతుందో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మనం చూశాం​. అందుకే ఈ మ్యాచ్‌ పూర్తిగా సాగాలని కివీస్‌ కోరుకుంటుంది. 

మరోవైపు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్‌ కివీస్‌ను భయపెడుతుంది. 2007, 2011 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో శ్రీలంక.. కివీస్‌ పాలిట కొరకరాని కొయ్యలా ఉండింది. ఈ రెండు వరల్డ్‌కప్‌ ఎడిషన్ల సెమీస్‌లో శ్రీలంక కివీస్‌ను మట్టికరిపించింది.

ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందేమోనని కివీస్‌ అభిమానులు కలవరపడుతున్నారు. దీనికి తోడు మెగా టోర్నీల్లో దురదృష్టం, కీలక ఆటగాళ్ల గాయాలు కివీస్‌కు ప్రతికూలంగా మారాయి. వరుణ గండాన్ని, సెంటిమెంట్‌ను అధిగమించి లంకపై భారీ తేడాతో గెలవాలని కివీస్‌ ఆటగాళ్లు అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు