IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

24 Nov, 2023 12:03 IST|Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్‌ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్‌ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్‌ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ టాప్‌లో ఉన్నాడు. మోర్గాన్‌ 107 ఇన్నింగ్స్‌ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్‌ కోహ్లి (98 ఇన్నింగ్స్‌ల్లో 106 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (98 ఇన్నింగ్స్‌ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా స్కై తన 51 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో 108 సిక్సర్లు బాదాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు