ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌.. టీమిండియాకు శుభవార్త

28 Feb, 2024 14:28 IST|Sakshi

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త తెలిసింది. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్‌కు పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. వర్క్‌ లోడ్‌ కారణంగా నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ మింగుడుపడని వార్త కూడా వినిపిస్తుంది.

స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఖరి మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం రాహుల్‌ను అతి త్వరలో లండన్‌కు పంపించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు ఆడిన రాహుల్‌.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా తొడ కండరాల సమస్య తలెత్తడంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా సమాచారం నిజమైతే రాహుల్‌ ఆఖరి టెస్ట్‌లో ఆడటం అనుమానమే. 

కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాల చేత విరాట్‌ కోహ్లి, గాయం కారణంగా మొహమ్మద్‌ షమీ దూరం కాగా.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జడేజా, బుమ్రా గాయాలు, ఇతరత్రా కారణాల చేత మధ్యలో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. సీనియర్ల గైర్హాజరీ, గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ.. యంగ్‌ ఇండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్‌ కైవసం చేసుకోవడం విశేషం. 

whatsapp channel

మరిన్ని వార్తలు