ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలుత ఇంగ్లండ్ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు. రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు.
భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది.
151.2kmph delivery from Mark Wood.
But Rohit Sharma says I'll play my favourite shot and send it out of the ground. 🫡pic.twitter.com/cuajTdxVHH
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ ఇన్నింగ్స్లో హిట్మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్గా నిలిచింది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్కు రోహిత్ తగు రీతిలో సమాధానం చెప్పాడు.
151.2 కిమీ వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్కు హిట్మ్యాన్ తన ఫేవరెట్ పుల్షాట్ ఆడి భారీ సిక్సర్గా మలిచాడు. రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్ను చూసి బౌలర్, ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. హిట్మ్యాన్ అభిమానులు ఈ షాట్కు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్ను ఎవ్వరూ ఆడలేరన్న విషయాన్ని ఒప్పుకోవాలి.