మహిళల ‘టెస్టు’కు సిద్ధం 

14 Dec, 2023 04:19 IST|Sakshi

నేటినుంచి భారత్, ఇంగ్లండ్‌ సమరం  

ఆత్మవిశ్వాసంతో హర్మన్‌ సేన 

ఇంగ్లండ్‌కు 100వ టెస్టు మ్యాచ్‌ 

ఉ.గం.9.30నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం 

ముంబై: రెండేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగుతోంది. టి20 సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌తో నేటినుంచి జరిగే ఏకైక టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్‌)లో భారత్‌ తలపడుతుంది. వన్డేలు, టి20లను పక్కన పెడితే టెస్టుల్లో భారత జట్టు ప్రత్యర్థి తో పోలిస్తే అనుభవం, ఫలితాలపరంగా చాలా వెనుకబడి ఉంది.

మన అమ్మాయిలకు ఎప్పుడో గానీ టెస్టులు ఆడే అవకాశం రాదు. ఓవరాల్‌గా భారత్‌ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడగా...99 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ ఇప్పుడు 100వ మ్యాచ్‌కు సిద్ధమైంది. 2014 తర్వాత భారత్‌లో మహిళల టెస్టు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత మహిళల క్రికెట్‌ దిగ్గజాలు మిథాలీరాజ్, జులన్‌ గోస్వామిల రిటైర్మెంట్‌ తర్వాత జట్టు ఆడుతున్న మొదటి టెస్టు ఇదే కానుంది.

ఈ నేపథ్యంలో టెస్టు అనుభవంపై ఇంగ్లండ్‌ ఆధారపడుతుండగా... సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతను హర్మన్‌ సేన నమ్ముకుంది. 2021 సెపె్టంబర్‌లో ఆఖరి సారిగా టెస్టు ఆడిన భారత్‌ ఆసీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది.
 
ఇంగ్లండ్‌ సమష్టిగా... 
దేశవాళీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఎక్కువగా ఆడటం పాటు ‘యాషెస్‌’ కార ణంగా కూడా ఇంగ్లండ్‌ టీమ్‌ తరచుగా టెస్టు మ్యాచ్‌ల బరిలోకి దిగుతూ వస్తోంది. ఇప్పు డు కూడా ఆ జట్టు ఈ ఫార్మాట్‌లో తమ బలాన్నే నమ్మకుంది. జట్టులో ఎక్కువ మంది సభ్యులకు టెస్టు అనుభవం ఉంది. కెప్టెన్‌ హీతర్‌ నైట్‌తో పాటు బీమాంట్, సివర్‌ బ్రంట్‌ కీలక బ్యాటర్లు కాగా...మిడిలార్డర్‌లో క్యాప్సీ, డాని వాట్‌ ప్రభావం చూపించగలరు.

బీమాంట్‌తో పాటు రెండో ఓపెనర్‌గా డంక్లీ బరిలోకి దిగవచ్చు. కీపర్‌ ఎమీ జోన్స్‌ ధాటిగా ఆడగలదు. స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ ఇంగ్లండ్‌కు బౌలింగ్‌లో ప్రధాన బలం. ఇతర బౌలర్లు క్రాస్, బెల్, డీన్‌ భారత పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరో చెప్పలేం.  ఇంగ్లండ్‌ జట్టు భారత గడ్డపై 2005 తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడటం ఇదే మొదటిసారి. 

వారిద్దరే కీలకం... 
భారత జట్టులో భారత కెప్టెన్ కు 3 టెస్టుల, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు 4 టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా...మిగతా జట్టు సభ్యులకు ఆమాత్రం అనుభవం కూడా లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే క్రీజ్‌లో నిలవడంలో వీరు ఏమాత్రం పట్టుదల కనబరుస్తారనేది ఆసక్తికరం. అందుకే జట్టు విజయావకాశాలు ప్రధానంగా హర్మన్, స్మృతిలపైనే ఆధారపడి ఉన్నాయి. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ తమ బ్యాటింగ్‌ బలాన్ని ప్రదర్శించాల్సి ఉంది.

ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడుకు మారుపేరైన షఫాలీ ఇక్కడ కాస్త ఓపికను చూపించి ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోడ్రిగ్స్‌ కూడా టెస్టుకు తగినట్లుగా తన ఆటతీరును మార్చుకోగలదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. అనుభవజు్ఞలైన స్పిన్నర్లు స్నేహ్‌ రాణా, రాజేశ్వరి గైక్వాడ్‌ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరితో పాటు దీప్తి శర్మ కూడా స్పిన్‌తో రాణించగలదు.

భారత్‌ ఆడిన గత రెండు టెస్టులు కూడా విదేశీ గడ్డపైనే జరిగాయి. ఆ రెండు మ్యాచ్‌లలో జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. అలా చూస్తే రేణుకా సింగ్, మేఘనా సింగ్‌లతో పాటు పూజ వస్త్రకర్‌కు అవకాశం ఉంటుంది. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే మాత్రం పూజను పక్కన పెట్టి అదనపు బ్యాటర్‌గా రిచా ఘోష్‌ను తీసుకోవచ్చు. 

>
మరిన్ని వార్తలు