మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

13 Oct, 2022 22:48 IST|Sakshi

మాజీ కోచ్‌ రవిశాస్త్రి టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత భారత జట్టులో భారీ మార్పులు తధ్యమని జోస్యం చెప్పాడు. ప్రస్తుత జట్టులో సగానికి పైగా స్థానాలు గల్లంతవుతాయని సంచలన కామెంట్స్‌ చేశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌ జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు ఇంచుమించు అలాగే ఉందని, ఈ ప్రపంచకప్‌ తర్వాత జట్టు అలా ఉండదని, ఊహించని మార్పులు జరుగుతాయని అన్నాడు.

మొత్తంగా అతి త్వరలో కొత్త టీమిండియాను చూస్తామని తనదైన స్టయిల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. శాస్త్రి.. ఓ పక్క టీమిండియాలో మార్పులు తప్పవని చెబుతూనే, ప్రస్తుత భారత బ్యాటింగ్‌ లైనప్‌పై ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌, వన్‌డౌన్‌లో విరాట్‌, 4వ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, 5,6 స్థానాల్లో హార్ధిక్‌, పంత్‌/డీకేలతో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ఆకాశానికెత్తాడు.

ఇదే సందర్భంగా భారత్‌ ఫీల్డింగ్‌లో మరింత మెరుగు పడాల్సి ఉందని హెచ్చరించాడు. ఈ విభాగంలో భారత్‌ మెరుగు పడితే ఫలితాలు తప్పక మనకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఫైనల్‌గా దినేశ్‌ కార్తీక్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్‌ కావచ్చని బాంబు పేల్చాడు.  
 

మరిన్ని వార్తలు