ద్రవిడ్‌ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్‌ ఎవరు..?

21 Nov, 2023 10:53 IST|Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ‍ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌తో  ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్‌ కోచ్‌ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్‌ వరల్డ్‌కప్‌ అనంతరం​ మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు స్టాండ్‌ ఇన్‌ కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. 

ఒకవేళ ద్రవిడ్‌ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే  లక్ష్మణ్‌ భారత జట్టు హెడ్‌ కోచ్‌ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే లక్ష్మణ్‌తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్‌ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. 

ధోనిని ఒప్పించి అప్పచెబితే..
టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్‌నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్‌ కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్‌ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే, సెహ్వాగ్‌లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది.

కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్‌ జట్టు కోచింగ్‌ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్‌ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు