ENG Vs IND 1st T20: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా..!

30 Jun, 2022 08:24 IST|Sakshi

బర్మింగ్‌హామ్ వేదికగా జూలై1న ఇంగ్లండ్‌- భారత జట్ల మధ్య  నిర్ణయాత్మక ఐదో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టు అనంతరం ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. కాగా టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత సీనియర్‌ ఆటగాళ్లందరూ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో సిరీస్‌లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, షమీ వంటి సీనియర్‌ ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా జూలై 7న జరగనుంది.

అయితే జూలై 1న ప్రారంభం కానున్న టెస్టు.. జూలై 5న ముగియనుంది. తొలి టీ20కు సన్నద్దం కావడానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు మ్యాచ్‌లో పాల్గొనున్న అగ్రశ్రేణి ఆటగాళ్లకు మూడు రోజులపాటు విశ్రాంతి ఇచ్చి.. జూలై 9న జరగనున్న రెండో టీ20కు జట్టులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

“ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడిన భారత జట్టు తొలి టీ20లో తలపడనుంది. రెండువ టీ20 నుంచి స్టార్‌ ఆటగాళ్లందరూ జట్టులోకి వస్తారు. వారికి కాస్త విశ్రాంతి అవసరం. కాగా ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ టీ20 సిరీస్‌ ముగిసే వరకు ఉంటారు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక ఇంగ్లండ్‌తో తొలి టీ20కు కూడా పాండ్యానే నాయకత్వం వహించే అవకాశం ఉంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌ ‘అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల’కు భలే ఛాన్స్‌.. ఇంగ్లండ్‌కు పయనం!

మరిన్ని వార్తలు