-

IPL 2022: జడ్డూ పట్ల సీఎస్‌కే వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆకాశ్‌ చోప్రా

12 May, 2022 15:24 IST|Sakshi
Photo Courtesy: IPL

సీఎస్‌కే తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ మొత్తానికే దూరమైన విషయం తెలిసిందే. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ జడ్డూ గాయపడ్డాడని సీఎస్‌కే యాజమాన్యం వివరణ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో మాత్రం రకరకాల అనుమానాలు నెలకొన్నాయి. జట్టును భ్రష్టుపట్టించాడనే (వరుస పరాజయాలు) ఉద్దేశంతో సీఎస్‌కే యాజమాన్యం కావాలనే జడేజాను తప్పించి ఉంటుందని వారు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో జడేజా-సీఎస్‌కే ఎపిసోడ్‌పై ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా మరో బాంబు పేల్చాడు. తదుపరి సీజన్‌లో జడేజా సీఎస్‌కేలో ఉండకవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడేజా విషయంలో సీఎస్‌కే వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశాడు. జడ్డూకి వ్యతిరేకంగా తెర వెనుక కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. సీఎస్‌కే యాజమాన్యం గత సీజన్‌లో సురేశ్‌ రైనా విషయంలో ఎలా ప్రవర్తించిందో జడేజా విషయంలోనూ అదే రిపీటవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 12) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా అతను సీఎస్‌కే-ముంబై మ్యాచ్‌పై కూడా విశ్లేషించాడు. ఈ రెండు జట్ల మధ్య సమరం దాయాదుల పోరు (భారత్‌-పాక్‌)ను తలపిస్తుందని, ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేయడం అంత సులువుకాదని అభిప్రాయపడ్డాడు. 

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. ముంబైతో పోలిస్తే సీఎస్‌కేకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. కాగా, జడేజా.. ఈ సీజన్‌ ఆరంభంలోనే ధోని నుంచి సీఎస్‌కే సారధ్య బాధ్యతలను తీసుకున్న విషయం తెలిసిందే. జడ్డూ కెప్టెన్సీలో సీఎస్‌కే ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓటమిపాలైంది. కెప్టెన్సీ భారం కారణంగా జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 
చదవండి: ఎన్ని గోల్డెన్‌ డకౌట్లైనా.. కోహ్లి ఇప్పటికీ గోల్డే..!

మరిన్ని వార్తలు