IPL 2022 KKR vs PBKS: ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన రికార్డు.. రోహిత్‌, గేల్‌లను అధిగమించి..

2 Apr, 2022 12:07 IST|Sakshi
కేకేఆర్‌ జట్టు(PC: IPL/ BCCI)

టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఐపీఎల్‌-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమేశ్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు.

ఇక తమ జట్టు మూడో మ్యాచ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఉమేశ్‌ యాదవ్‌. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌ కెప్టెన్‌ మాయంక్‌ అగర్వాల్‌, లివింగ్‌స్టోన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాహుల్‌ చహర్‌ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ అతడు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా పంజాబ్‌పై తనకున్న ఘనమైన రికార్డును మరోసారి రిపీట్‌ చేశాడు.

ఈ క్రమంలో ఓ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఒకే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్‌లో అత్యధికసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అ‍గ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌ శర్మ, క్రిస్‌గేల్‌ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఉమేశ్‌ యాదవ్‌కు పంజాబ్‌పై ఇది ఆరో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు.

అంతకుముందు యూసఫ్‌ పఠాన్‌ దక్కన్‌ చార్జర్స్‌పై 5 సార్లు, రోహిత్‌ శర్మ కేకేఆర్‌పై 5 సార్లు, క్రిస్‌గేల్‌ కేకేఆర్‌పై 5 సార్లు ఈ ఘనత సాధించారు. ఇక ఐపీఎల్‌-2022లో పంజాబ్‌తో కేకేఆర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉమేశ్‌ విజృంభణకు తోడు ఆండ్రీ రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

చదవండి: IPL 2022 KKR Vs PBKS: నేనేం చేయగలనో నాకు తెలుసు.. క్రికెట్‌ ఆడేది అందుకే: రసెల్‌

మరిన్ని వార్తలు